ఎయిరిండియాకు వరుస సమస్యలు కుదుపులు తెస్తున్నాయి. సాంకేతిక లోపాలు, విమానాల్లో తీవ్ర టర్బులెన్స్, సిబ్బంది వివాదాలు సంస్థపై ఒత్తిడిని పెంచుతున్నాయి. తాజాగా ఫుకెట్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిరిండియా AI2379 విమానంలో తీవ్ర టర్బులెన్స్ చోటుచేసుకుంది. విమానం ఒక్కసారిగా సుమారు 300 అడుగుల మేర కిందికి జారిపోవడంతో 12 మంది ప్రయాణికులు, సిబ్బంది గాయపడినట్లు నివేదికలు వెల్లడించాయి.
ఎయిర్ ఇండియా కుదుపుల అంశం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తోంది. విమానాన్ని నడిపిన చీఫ్ పైలట్ పోస్ట్-ఫ్లైట్ స్క్రీనింగ్లో డోప్ టెస్ట్లో విఫలమైనట్లు ప్రాథమిక నివేదికలు వెలువడ్డాయి. దీనిపై డీజీసీఏ పూర్తి స్థాయిలో విచారణ చేపట్టినట్లు సమాచారం. మరోవైపు ఎయిరిండియా విమానాల్లో సాంకేతిక లోపాల సంఖ్య కూడా ఆందోళన కలిగిస్తోంది. ఇంజిన్ వార్నింగ్లు, హైడ్రాలిక్ వ్యవస్థ సమస్యలు, విమాన నియంత్రణ లోపాలు, ఇంధనం లేదా ఇంజిన్ ఆయిల్ లీకేజీల వంటి ఘటనలు నమోదవుతున్నట్లు ప్రభుత్వ గణాంకాలు సూచిస్తున్నాయి.
అంతర్జాతీయ సర్వీసులపైనా ఎయిరిండియాకు సవాళ్లు ఎదురయ్యాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, పెరిగిన ఇంధన ధరలు, విమానాల కొరత ప్రభావంతో జూన్ నుంచి ఆగస్టు మధ్య దాదాపు 145 అంతర్జాతీయ వీక్లీ సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేసినట్లు సమాచారం. ఢిల్లీ-చికాగో, ఢిల్లీ-నెవార్క్, ముంబై-న్యూయార్క్ వంటి కీలక లాంగ్హాల్ మార్గాలతో పాటు యూరప్, ఆసియా రూట్లలోనూ సర్వీసుల కోతలు చోటుచేసుకున్నాయి. దీంతో ప్రయాణికులకు ఇబ్బందులు పెరిగాయి.
అయితే సెప్టెంబర్ 1 నుంచి చాలా అంతర్జాతీయ సర్వీసులను తిరిగి పునరుద్ధరించే చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. వరుస సాంకేతిక సమస్యలు, టర్బులెన్స్ ఘటనలు, విమానాల కొరత, ఇంధన వ్యయాల పెరుగుదలతో ఎయిరిండియాకు సవాళ్లు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ప్రయాణికుల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. డీజీసీఏ విచారణలో ఎలాంటి అంశాలు బయటపడతాయన్నది ఇప్పుడు కీలకంగా మారింది.