ఆయనను ఓ మౌనముని అంటారు. ఆయనకు వెన్నంటే ఓ నీడ ఉండేది. ఆ ముని మన్మోహన్ సింగ్ , ఆ నీడ సోనియాగాంధీ. పదేళ్ల యూపీఏ పాలన ఇరువురు కనుసన్నల మధ్య సాగిందంటే అతిశయోక్తి కాదు. దశాబ్దకాలంపాటు సాగిన యూపీఏ పాలనలో ఇరువురు నేతలపై అనేక విమర్శలు వెల్లువెత్తాయి. అందులో ఒకటి బొగ్గు బ్లాకుల కేటాయింపు. ఈ బొగ్గు కుంభకోణం ఇరువురి రాజకీయ జీవితంలో మాయన మచ్చగా నిలిచింది. అయితే సుప్రీంకోర్టు ఈ కుంభకోణంలో మన్మోహన్ సింగ్ కు క్లీన్ చిట్ ఇవ్వటంపై సోనియాగాంధీ స్పందించారు. ఈసందర్భంగా కీలక వ్యాఖ్యలు చేస్తూ ఆమె ఓ పత్రికకు వ్యాసమే రాశారు. మన్మోహన్ అందించిన సేవలను గుర్తుచేస్తూ.. చరిత్ర ఆయను ఎన్నటికీ గుర్తుంచుకుంటుందని వ్యాఖ్యానించారు.
మాజీ ప్రధాని సింగ్ను అత్యంత ప్రభావశీలమైన ప్రధానిగా, మృదుస్వభావిగా సోనియా కొనియాడారు. నిశ్శబ్దంగా, సౌమ్యంగా ఉంటూనే దేశానికి అత్యంత కీలకమైన సేవలు అందించిన నేతగా ఆయనను అభివర్ణించారు.మన్మోహన్ సింగ్ నిజాయితీపై గతంలో వేసిన మచ్చలు, చేసిన ఆరోపణలన్నీ నిరాధారమైనవని సోనియా గాంధీ పేర్కొన్నారు. ఆయనపై సాగిన ప్రచారం ప్రణాళికాబద్ధమైన రాజకీయ కక్ష సాధింపు చర్యగా అభివర్ణించారు.. సుప్రీంకోర్టు తీర్పుతో నిజాలు స్పష్టమయ్యాయన్నారు.
మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో సమాచార హక్కు చట్టం, విద్యా హక్కు చట్టం, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వంటి కీలకమైనవి అమలులోకి వచ్చాయని సోనియా గుర్తుచేశారు. భారత్–అమెరికా అణు ఒప్పందం ద్వారా దేశ ప్రతిష్ఠను ప్రపంచ స్థాయిలో మరింత పెంచారని పేర్కొన్నారు.మన్మోహన్ సింగ్పై జరిగిన విమర్శలు, ఆరోపణలకు కాలమే సమాధానం చెబుతుందని.. చరిత్ర మాత్రం ఆయనను గొప్ప ప్రధానిగా గుర్తుంచుకుంటుందని సోనియా గాంధీ వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో మన్మోహన్ సింగ్ వారసత్వాన్ని గుర్తుచేస్తూ సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.