12
తమ గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలంటూ నల్గొండ జిల్లా గుడిపల్లి మండలం గణపురం గ్రామస్తులు ఆందోళనకు దిగారు. బృందావన కాలనీకి రహదారి కావాలంటూ గుడిపల్లి ఎంపీడీవో కార్యాలయం ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. తాత ముత్తాతల కాలం నుంచి ఇక్కడే నివాసం ఉంటున్నామని.. అయినా కొందరు రాజకీయ కారణాలతో రహదారిని అడ్డుకుంటున్నారని గ్రామస్తులు ఆరోపించారు. రహదారి లేకపోవడంతో సుమారు వంద కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో కూడా రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి రహదారి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే ఈ నెల 13న కుటుంబ సభ్యులతో కలిసి నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు.