తెలంగాణ జైళ్ల చరిత్రలో ఓ కీలక ముందడుగు పడింది. జైల్లో ఉంటూనే చదువును కొనసాగించిన 78 మంది ఖైదీలు NIOS ద్వారా పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు. చర్లపల్లి సెంట్రల్ ప్రిజన్, నిజామాబాద్ సెంట్రల్ ప్రిజన్, హైదరాబాద్ మహిళా ప్రత్యేక జైలుకు చెందిన మొత్తం 108 మంది ఖైదీలు SSC కోసం నమోదు చేసుకోగా.. వారిలో 78 మంది విజయవంతంగా పరీక్షలు పాసయ్యారు. చర్లపల్లిలో 56 మంది, నిజామాబాద్లో 15 మంది, హైదరాబాద్ మహిళా జైలులో 7 మంది ఉత్తీర్ణులయ్యారు. ఏడాది పాటు రెగ్యులర్ తరగతులు, మాక్ టెస్టులు, ప్రీ-బోర్డ్ పరీక్షలతో ఖైదీలను సిద్ధం చేశారు. వారి విద్య, పునరావాసాన్ని ప్రోత్సహించేలా జైళ్ల శాఖ డీజీ డా. సౌమ్య మిశ్రా ప్రత్యేక డైరెక్టర్ జనరల్ రిమిషన్ ప్రకటించారు. ఇక SSC పాసైన ఖైదీలు NIOS ద్వారా 10+2 చదువుతో పాటు.. చర్లపల్లి జైలులోని ITIలో సాంకేతిక, వృత్తి విద్యా కోర్సులు అభ్యసించే అవకాశం కల్పిస్తున్నారు. విద్య ద్వారా ఖైదీల్లో ఆత్మవిశ్వాసం, నైపుణ్యాలను పెంచి.. సమాజంలో గౌరవప్రదమైన జీవితానికి సిద్ధం చేయడమే లక్ష్యంగా జైళ్ల శాఖ ముందుకు సాగుతోంది.
జైల్లోనే చదువు.. 78 మంది ఖైదీల విజయం.
10
previous post