నిజామాబాద్లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల ఒత్తిడి, అనారోగ్య సమస్యలతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన ఓ భార్యాభర్తలు మృతి చెందారు. ఈ ఘటనతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.విద్యుత్ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న నరేష్ ఇటీవలే నిజామాబాద్ రూరల్ ఈఈఆర్ఓ సెక్షన్లో విధుల్లో చేరారు. కొత్తగా ఇంటి నిర్మాణం చేపట్టడంతో అంచనాలకు మించి ఖర్చులు పెరగడం.. అప్పులు పెరగడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు సమాచారం. అప్పుల్లో కొంత భాగాన్ని తీర్చేందుకు ఇంటిని విక్రయించినప్పటికీ.. మరికొన్ని అప్పులు మిగిలిపోయాయి. రుణదాతల ఒత్తిడి పెరగడంతో భార్యాభర్తలు తీవ్ర ఆందోళనకు గురైనట్లు తెలుస్తోంది.
నిన్న ఇద్దరు పిల్లలను సరస్వతీనగర్లోని నరేష్ సోదరి వద్ద ఉంచి.. భార్యతో కలిసి పంచముఖి హనుమాన్ ఆలయం సమీపంలోని అద్దె ఇంటికి వెళ్లారు. ఇంటి తలుపులు తెరవకపోవడంతో యజమాని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించగా.. ఇద్దరూ అపస్మారక స్థితిలో కనిపించారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.ఘటనపై మేఘన తండ్రి మోహన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నరేష్ రాసినట్లు భావిస్తున్న ఓ లేఖను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అందులో ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం, మానసిక ఒత్తిడితో తీవ్రంగా బాధపడుతున్నట్లు పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.
అయితే తల్లిదండ్రుల మృతితో తొమ్మిదేళ్ల బాలుడు, ఏడేళ్ల చిన్నారి ఒక్కసారిగా తల్లిదండ్రులను కోల్పోయారు. తమ తల్లిదండ్రులు ఎప్పుడు వస్తారంటూ బంధువులను అడుగుతున్న చిన్నారులను చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. పిల్లల భవిష్యత్తుపై ఇప్పుడు కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది.విద్యుత్ శాఖ ఉద్యోగిగా సహచరులతో ఆప్యాయంగా ఉండే నరేష్ మృతితో సహోద్యోగులు విషాదంలో మునిగిపోయారు.