తెలంగాణలో సాగునీటి పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్లోని MCR HRDలో ఇరిగేషన్, పౌర సరఫరాల శాఖలపై ఉన్నతస్థాయి అధికారులతో సమీక్ష జరిపారు. ప్రాజెక్టుల్లోకి వస్తున్న వరద నీరు, రిజర్వాయర్ల పరిస్థితి, సాగునీటి విడుదలపై అధికారులతో చర్చించారు. ప్రధాన ప్రాజెక్టులు పూర్తిగా నిండిన తర్వాతే సాగునీటి విడుదలపై తుది నిర్ణయం తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. ఇదే సమయంలో రైస్ మిల్లర్ల వ్యవహారంపైనా సీరియస్ అయిన రేవంత్.. ప్రభుత్వం, రైతులను ఇబ్బంది పెట్టేలా బ్లాక్మెయిల్ చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.
( ) ఇటీవల కురిసిన వర్షాలతో తెలంగాణలోని ప్రాజెక్టులు, రిజర్వాయర్లలోకి భారీగా నీటి ఇన్ఫ్లో వస్తోంది. ఈ పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమగ్రంగా సమీక్షించారు. రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టులన్నీ పూర్తిగా నిండిన తర్వాతే పొలాలకు సాగునీరు విడుదలపై తుది నిర్ణయం తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్లో ఉన్న పనులను వేగవంతం చేసి.. భవిష్యత్ నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు.
( ) రైతులకు సాగునీటి భద్రత కల్పించడమే లక్ష్యంగా సమన్వయంతో పనిచేయాలని సీఎం స్పష్టం చేశారు. అందుబాటులో ఉన్న నీటి నిల్వలు, ప్రాజెక్టుల్లోకి వస్తున్న ఇన్ఫ్లోను ఎప్పటికప్పుడు అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఎకరాకు సాగునీరు అందేలా ప్రణాళిక రూపొందించాలని సూచించారు. మరోవైపు కేంద్రంతో జరుగుతున్న చర్చలపైనా సమీక్షలో ప్రస్తావన వచ్చింది. తుమ్మిడిహట్టి ప్రాజెక్టు, ఇతర సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతుల పురోగతిపై అధికారులతో చర్చించారు.
( ) ఇదే సమావేశంలో పౌర సరఫరాల శాఖపై కూడా సీఎం రేవంత్ సీరియస్ రివ్యూ నిర్వహించారు. రైస్ మిల్లర్ల వ్యవహారాలు, పెండింగ్ బకాయిలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం లేదా రైతులను ఇబ్బంది పెట్టేలా బ్లాక్మెయిల్కు పాల్పడితే సహించేది లేదని ఘాటుగా హెచ్చరించారు. మరోవైపు మహిళా సంఘాలకు ఆర్థికంగా మరింత అవకాశాలు కల్పించే దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారు. పైలట్ ప్రాజెక్టు కింద రాష్ట్రంలోని ఐదు నియోజకవర్గాల్లో గోదాముల నిర్వహణ బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించాలని నిర్ణయించారు.