దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోటపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేశ చరిత్రలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ‘వందేమాతరం’ గేయాన్ని పూర్తిస్థాయిలో ఆలపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
జెండా ఆవిష్కరణకు ముందు ప్రధాని మోదీ రాజ్ఘాట్కు చేరుకుని మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. అనంతరం ఎర్రకోటకు చేరుకుని గౌరవ వందనం స్వీకరించి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. వేడుకల సందర్భంగా వాయుసేన హెలికాప్టర్ల నుంచి పూల వర్షం కురిపించారు.
స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఎర్రకోటపై ప్రధాని మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించడం ఇది వరుసగా 13వసారి. అనంతరం జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని… భారత్ చిన్న లక్ష్యాలతో సరిపెట్టుకోకూడదని, అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.స్వయం సమృద్ధి, సెమీకండక్టర్ రంగం, స్థానిక ఉత్పత్తుల ప్రోత్సాహం, పేదరిక నిర్మూలన, వికసిత్ భారత్ లక్ష్యాలు తన ప్రసంగంలో ప్రధానాంశాలుగా నిలిచాయి. గతంలో బలహీన ఆర్థిక వ్యవస్థల జాబితాలో ఉన్న భారత్ ఇప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా మారిందని ప్రధాని పేర్కొన్నారు.ఇక 140 కోట్ల మంది భారతీయుల సంకల్పశక్తిని ఎవరూ ఆపలేరని స్పష్టం చేసిన మోదీ… దేశంలోని పలు ప్రాంతాల్లో ఇటీవల సంభవించిన విపత్తులను ప్రస్తావిస్తూ, బాధిత కుటుంబాలకు యావత్ దేశం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.