రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ అథారిటీ 64వ సమావేశం జరిగినట్లు మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ఈ సమావేశంలో రాజధాని ప్రాంత అభివృద్ధికి సంబంధించి సీఆర్డీఏ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఇన్నర్ రింగ్ రోడ్డు, రైల్వే లైన్ నిర్మాణం కోసం మోతడక గ్రామంలో 2,340 ఎకరాల భూమిని కేటాయించేందుకు గతంలో తీర్మానం చేశామని, దానికి నేడు అథారిటీ ఆమోదం తెలిపిందన్నారు.
పల్నాడు జిల్లాలో దేవదాయశాఖకు చెందిన 244.39 ఎకరాల ఇనాం భూములను ల్యాండ్ పూలింగ్లో చేర్చేందుకు సీఆర్డీఏ పచ్చజెండా ఊపిందన్నారు మంత్రి. ఇందుకు రూ.122 కోట్లు చెల్లించేందుకు అంగీకారం తెలిపినట్లు చెప్పారు. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టును ప్రారంభించామని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని తిరిగి చేపట్టినట్లు నారాయణ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రేరాకు రెన్యూవల్ ఫీజును రద్దు చేసేందుకు కూడా సీఆర్డీఏ అంగీకారం తెలిపిందన్నారు. రైతులకు యాన్యుటీ కింద గత నెలలో రూ.300 కోట్లు చెల్లించామని మంత్రి తెలిపారు. ఇందుకోసం తీసుకున్న రుణానికి ర్యాటిఫికేషన్ ఇచ్చామని చెప్పారు. డేటా సెంటర్కు 9 గిగావాట్ల సామర్థ్యానికి టెండర్లు పిలిచేందుకు అనుమతి ఇచ్చినట్లు నారాయణ పేర్కొన్నారు.