పర్యావరణ పరిరక్షణ, చారిత్రక సంపద రక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అనకాపల్లి జిల్లాలోని ఆధ్యాత్మిక, చారిత్రక ప్రాధాన్యం ఉన్న పంచధారల కొండల ప్రాంతాన్ని ‘నో మైనింగ్ జోన్’గా ప్రకటించింది. దీంతో ఈ ప్రాంతంలో తవ్వకాలు, క్వారీ పనులపై పూర్తి నిషేధం అమల్లోకి వచ్చింది. మైనింగ్ వల్ల జీవవైవిధ్యంతో పాటు శ్రీ ఉమా ధర్మలింగేశ్వర స్వామి ఆలయం, సహజ పుణ్యతీర్థ జలధారలకు ముప్పు ఉందంటూ వచ్చిన ఫిర్యాదులపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
తవ్వకాలతో పర్యావరణ సమతుల్యత, చారిత్రక కట్టడాలకు నష్టం జరిగే అవకాశం ఉందని అధికారులు నిర్ధారించారు. దీంతో గతంలో మంజూరైన 2.153 హెక్టార్ల క్వారీ లీజు అనుమతులను ప్రభుత్వం రద్దు చేసింది. కొండల సహజ రూపురేఖలు, జీవవైవిధ్యాన్ని కాపాడేందుకు తీసుకున్న ఈ నిర్ణయంపై స్థానిక భక్తులు, పర్యావరణ ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.