మైన్స్ అండ్ జియాలజీ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బొజ్జ జయరాజుపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు కావడం కలకలం రేపుతోంది. ప్రస్తుతం వరంగల్ డిప్యూటీ డైరెక్టర్గా ఎఫ్ఏసీ బాధ్యతలు నిర్వహిస్తున్న జయరాజు.. గతంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విధులు నిర్వహించారు. అవినీతి, అక్రమ మార్గాల్లో భారీగా ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై ఏసీబీ కేసు నమోదు చేసి సోదాలు చేపట్టింది.
అధికారికి సంబంధించిన మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ బోడుప్పల్లో జీ ప్లస్ టూ భవనం, కేపీహెచ్బీ కాలనీలో ఫ్లాట్తో పాటు ఐదు ప్లాట్లను గుర్తించారు. మూడు పాయింట్ రెండు ఒక ఎకరాల వ్యవసాయ భూమి, మూడు కార్లు, రెండు ద్విచక్ర వాహనాలు కూడా గుర్తించినట్లు ఏసీబీ వెల్లడించింది.
సోదాల్లో రూ.10.03 లక్షల నగదు, 629 గ్రాముల బంగారు ఆభరణాలు, బ్యాంకు ఖాతాల్లో రూ.71.27 లక్షల నిల్వలు గుర్తించారు. ఎల్ఐసీ, మ్యాక్స్ లైఫ్, పోస్టాఫీస్ సేవింగ్స్తో పాటు ఇతర పెట్టుబడులను కూడా అధికారులు గుర్తించారు. ఇప్పటివరకు గుర్తించిన ఆస్తుల విలువ రూ.3.06 కోట్లుగా ఉన్నట్లు ఏసీబీ తెలిపింది. అయితే మార్కెట్ విలువ మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది.
మరోవైపు డ్రైవర్ ఖాతా నుంచి అధికారి కుమార్తె ఖాతాకు రూ.24.80 లక్షలు బదిలీ అయినట్లు ఏసీబీ గుర్తించింది. ఇసుక రవాణా చేస్తున్న వ్యక్తుల నుంచి డబ్బు సేకరించినట్లు డ్రైవర్ వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం. ఈ ఆర్థిక లావాదేవీలతో పాటు అదనపు ఆస్తులపై ఏసీబీ మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తోంది.