జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో ఓ మహిళ తలలో బుల్లెట్ బయటపడటం సంచలనం సృష్టించింది. తొలుత కర్రలతో జరిగిన దాడిగా భావించిన పోలీసులు.. స్కానింగ్ రిపోర్టులు చూసి షాక్కు గురయ్యారు. మెట్పల్లి పరిధిలోని మఠంవాడకు చెందిన లక్ష్మి అనే మహిళకు, ఆమె బంధువులకు మధ్య కొంతకాలంగా భూ వివాదం నడుస్తోంది. ఈ క్రమంలోనే ఈ నెల జూన్ 15న ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఈ దాడిలో లక్ష్మి తలకు తీవ్ర గాయాలయ్యాయి. దాడి జరిగిన సమయంలో బంధువులు కర్రలతో కొట్టడం వల్లే ఆమెకు గాయాలయ్యాయని భావించిన పోలీసులు, ఆ మేరకు కేసునమోదు చేశారు. అయితే, లక్ష్మి పరిస్థితి విషమించడంతో ఆమెను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆమె తలకు స్కానింగ్ పరీక్షలు నిర్వహించగా అసలు విషయం వెలుగుచూసింది. లక్ష్మి తల భాగంలో ఒక లోహపు వస్తువు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. వెంటనే అత్యవసర శస్త్రచికిత్స నిర్వహించి ఆ లోహపు ముక్కను బయటకు తీశారు. అది తుపాకీ బుల్లెట్ అని తేలడంతో వైద్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మహిళ తల నుంచి తీసింది నాటు తుపాకీ బుల్లెట్గా పోలీసులు అనుమానిస్తున్నారు. దాడికి పాల్పడిన నిందితుల వద్ద కొంతమంది బీహార్కు చెందిన కూలీలు పనిచేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. సదరు బీహార్ కూలీల ద్వారానే నిందితులు ఉత్తరాది నుంచి ఈ నాటు తుపాకీని తెప్పించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మహిళ తలలో మెటల్ ఆబ్జెక్ట్ బయటపడటంతో మెట్పల్లి పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. హత్యాయత్నం కోణంలో కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు సమాచారం.
జగిత్యాల జిల్లా మెట్పల్లిలో మహిళ తలలో బులెట్ కలకలం.
167
previous post