కొమురవెల్లి మల్లన్న భక్తులకు శుభవార్త. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కొమురవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభానికి రంగం సిద్ధమైంది. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి గంగాపురం కిషన్రెడ్డి సోషల్ మీడియా వేదికగా ఈ ప్రాజెక్టు 99 శాతం పూర్తైందని వెల్లడించారు. త్వరలోనే భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించడంతో స్థానికులు, మల్లన్న భక్తుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వే మార్గంలో నిర్మితమైన కొమురవెల్లి మల్లన్న రైల్వే స్టేషన్ ప్రారంభానికి సిద్ధమవుతోంది. కొమురవెల్లి మల్లన్న భక్తుల చిరకాల కోరిక త్వరలోనే నెరవేరబోతోంది. సుమారు 5 కోట్ల రూపాయల 63 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ రైల్వే స్టేషన్ అత్యాధునిక సౌకర్యాలతో రూపుదిద్దుకుంది.ఈ స్టేషన్ అందుబాటులోకి వస్తే హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు నేరుగా రైలు మార్గంలో కొమురవెల్లికి చేరుకునే అవకాశం కలుగుతుంది. దీంతో ప్రయాణం మరింత సులభతరం కానుంది.
ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని విశాలమైన వెయిటింగ్ హాల్, టికెట్ కౌంటర్లు, సౌకర్యవంతమైన ప్రవేశ ద్వారాలు, ఆధునిక మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. అలాగే స్టేషన్ నుంచి కొమురవెల్లి మల్లన్న ఆలయం వరకు ప్రత్యేక రహదారి అనుసంధాన పనులను కూడా అధికారులు పూర్తి చేశారు. దీంతో రోడ్డు మార్గంపై భక్తులకు ఉన్న భారం తగ్గడంతో పాటు ప్రయాణ సమయం, ఖర్చు కూడా ఆదా కానున్నాయి.
కొమురవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభం కేవలం రవాణా సౌకర్యానికే పరిమితం కాకుండా స్థానిక ప్రాంత అభివృద్ధికి కూడా దోహదపడనుంది. వ్యాపార, ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు పర్యాటక రంగం మరింత విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.త్వరలోనే స్టేషన్ను ప్రజలకు అంకితం చేయనున్నట్లు వెల్లడించడంతో స్థానికులు, మల్లన్న భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.




Total views : 202963