Saturday, August 29, 2026
News Navigation
Saturday, August 29, 2026
News Navigation

Breaking

Saturday, August 29, 2026
Home Latest News పశ్చిమాసియా యుద్ధ మేఘాలను దాటి కొన్ని చమురు, గ్యాస్‌ నౌకలు ఒక్కొక్కటిగా భారత్‌కు చేరుకుంటున్నాయి.

పశ్చిమాసియా యుద్ధ మేఘాలను దాటి కొన్ని చమురు, గ్యాస్‌ నౌకలు ఒక్కొక్కటిగా భారత్‌కు చేరుకుంటున్నాయి.

by CVR NEWS

పశ్చిమాసియా యుద్ధ మేఘాలను దాటి కొన్ని చమురు, గ్యాస్‌ నౌకలు ఒక్కొక్కటిగా భారత్‌కు చేరుకుంటున్నాయి. దేశీయ ఇంధన ప్రయోజనాలను కాపాడటంలో భాగంగా ఈ నౌకల భద్రత కోసం భారత నేవీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. చమురు,ఎల్పీజీ నౌకలను సురక్షితంగా హర్మూజ్‌ను దాటిస్తోంది. సాధారణంగా భారత్‌ వచ్చే చమురు, గ్యాస్‌ నౌకలు సౌదీ అరేబియాలోని రాస్‌ తనురా వంటి పోర్టుల నుంచి ప్రయాణం ప్రారంభిస్తాయి. ఇవి పర్షియన్‌ గల్ఫ్‌ మీదుగా హర్మూజ్‌ జలసంధి వద్దకు చేరుకుంటాయి. నౌక వేగం, ప్రయాణించే మార్గాన్ని బట్టి ఇందుకు గరిష్ఠంగా రెండు రోజుల సమయం పడుతుంది. ప్రస్తుతం ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ జలసంధి వద్దే వందలాది నౌకలు చిక్కుకుపోయాయి. దీంతో వాటిని సురక్షితంగా తీసుకొచ్చేందుకు భారత నౌకాదళం రంగంలోకి దిగింది. ఇరాన్‌ అధికారుల నుంచి అనుమతులు తీసుకోవడంతో పాటు నౌకలు జలసంధి దాటేవరకు అనుక్షణం వాటికి సహాయసహకారాలు అందిస్తోంది. హర్మూజ్‌ దాటిన తర్వాత ఈ నౌకలు గల్ఫ్‌ ఆఫ్‌ ఒమన్‌లోకి ప్రవేశించి అక్కడినుంచి అరేబియా సముద్రంలోకి వస్తాయి. దీంతో ఈ రెండు ప్రాంతాల వద్ద భారత నేవీ 5 యుద్ధ నౌకలను మోహరించింది.

ఈ యుద్ధ నౌకల సహకారంతోనే ఇటీవల రెండు గ్యాస్‌ ట్యాంకర్లు పైన్‌ గ్యాస్‌, జగ్‌ వసంత్‌ అంతర్జాతీయ జలాల్లోకి ప్రవేశించి భారత్‌ దిశగా పయనిస్తున్నాయి. అంతకుముందు శివాలిక్‌, నందాదేవి వంటి గ్యాస్‌ నౌకలు కూడా ఈ ఆపరేషన్‌లో భాగంగానే దేశీయ పోర్టులకు చేరుకోగలిగాయి. ప్రస్తుతం ఇక్కడ భారత్‌కు రావాల్సిన 22 నౌకలు తరలింపునకు సిద్ధంగా ఉన్నాయి. వీటిల్లో 20 వరకు ఎల్పీజీ, ఎల్‌ఎన్‌జీ, క్రూడ్‌ ఆయిల్‌ రవాణా చేస్తున్నవే..! సాధారణంగా సముద్రంలో ప్రయాణం హైడ్రోగ్రాఫిక్‌ చార్ట్‌లు, నావిగేషన్ వ్యవస్థల ఆధారంగా ఉంటుంది. ప్రస్తుతం ఉద్రిక్తతల నేపథ్యంలో హర్మూజ్‌ జలసంధి సమీపంలో ఇరాన్‌ సీమైన్స్‌ను అమర్చినట్లు వార్తలొచ్చాయి. వీటిల్లో చాలావరకు బయటకు కన్పించవు. వీటి కారణంగా నౌకలకు తీవ్ర ముప్పు పొంచి ఉంటుంది. అందుకే, ఈ సీమైన్స్‌ తగలకుండా నౌకలను హర్మూజ్‌ను దాటించడం అత్యంత ఆవశ్యకం. దీన్ని గుర్తించిన భారత నేవీ.. మన నౌకల కోసం ప్రత్యేక హైడ్రోగ్రాఫిక్‌ చార్ట్‌లను రూపొందిస్తోంది. నిఘా నౌకలతో సముద్ర గర్భాన్ని స్కాన్‌ చేసి నావిగేషన్‌ రూట్స్‌ను గుర్తిస్తోంది. ఆయా మార్గాలను నౌకలకు ఎప్పటికప్పుడు అందిస్తూ వాటిని హర్మూజ్‌ నుంచి తీసుకొస్తోంది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: