దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో ఆధునిక యంత్రాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ పనులను వేగవంతం చేశారు. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రత్యేక చొరవతో ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఆలయ పునర్నిర్మాణ, అభివృద్ధి పనుల కారణంగా స్వామివారి ప్రత్యక్ష దర్శనాలు తాత్కాలికంగా నిలిపివేయగా, స్వామివారికి ఏకాంత సేవలు, నిత్య కైంకర్యాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. భక్తుల ఆధ్యాత్మిక భావాలను దృష్టిలో ఉంచుకొని ఆలయ అధికారులు భీమేశ్వరాలయంలో దర్శన ఏర్పాట్లు చేసి భక్తులకు పూజా కార్యక్రమాలు నిర్వహించే అవకాశం కల్పిస్తున్నారు.
ఆలయ ఈవో, సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేస్తూ పనుల పురోగతిని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అభివృద్ధి పనులు పూర్తయిన అనంతరం భక్తులకు మరింత సౌకర్యవంతమైన, వేగవంతమైన దర్శన వ్యవస్థ అందుబాటులోకి రానుందని తెలిపారు. త్వరలోనే రాజరాజేశ్వర స్వామివారి దర్శనాలు భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి రాజన్న దర్శనాలను పునఃప్రారంభించే దిశగా పనులు కొనసాగుతున్నాయి.




Total views : 151344