నవ్యాంధ్రప్రదేశ్ను అభివృద్ధి పథంలో ముందంజలో నిలిపేందుకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన అడుగులు వేస్తోంది. అమరావతి వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో రాష్ట్ర ప్రణాళికా విభాగం ఒక కీలకమైన అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. రాబోయే కాలంలో రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అగ్రగామిగా నిలిపేందుకు రూపొందించిన “స్వర్ణాంధ్ర 2047 విజన్” లక్ష్యాల సాధనే ధ్యేయంగా ఈ ఒప్పందం జరిగింది. రాష్ట్ర ప్రణాళికా విభాగంతో కేఆర్ఈఏ యూనివర్సిటీ సారధ్యంలోని ప్రసిద్ధ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ రీసెర్చ్..ఐఎఫ్ఎంఆర్ఈ భాగస్వామ్యాన్ని పటిష్టం చేసుకుంది.
ఈ ప్రత్యేక కార్యక్రమానికి సంబంధించిన అధికారిక ఒప్పంద పత్రాలను రాష్ట్ర ప్రణాళికా విభాగం ముఖ్యకార్యదర్శి పీయూష్ కుమార్ మరియు ఐఎఫ్ఎంఆర్ సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రి సమక్షంలో పరస్పరం మార్చుకున్నారు. ఈ దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా నిర్దేశించుకున్న పది సూత్రాల ఆర్థిక మరియు సామాజిక లక్ష్యాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడానికి ఈ రెండు విభాగాలు కలిసి పనిచేస్తాయి.