రాష్ట్రంలో విద్యావ్యవస్థ నిర్వీర్యమవుతోందని, ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ కోసం నేడు రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల బంద్ను తలపెట్టినట్లు ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ బంద్కు విద్యార్థులు, తల్లిదండ్రులు, పాఠశాలల యాజమాన్యాలు పూర్తిగా సహకరించి విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా విద్యాశాఖను కలిగి ఉండి కూడా ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలకు బ్రాండ్ అంబాసిడర్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రేషనలైజేషన్ పేరుతో రాష్ట్రంలో దాదాపు 23 వేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని, పేద విద్యార్థులకు చదువును దూరం చేసే ఈ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఉచితంగా 25 శాతం సీట్లు కేటాయించాలనే విద్యాహక్కు చట్టాన్ని ప్రభుత్వం పూర్తిగా అటకెక్కించిందని రాంబాబు విమర్శించారు. విచ్చలవిడి ఫీజుల దోపిడీకి పాల్పడుతున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం రెడ్ కార్పెట్ పరుస్తోందని, వెంటనే ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఒకే పర్మిషన్తో పలు బ్రాంచ్లు నడుపుతూ సరస్వతి నిలయాలను వ్యాపార కేంద్రాలుగా మార్చుతున్న సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి ఇప్పటికైనా స్పందించి ప్రభుత్వ విద్యా వ్యవస్థను గాడిలో పెట్టాలని, ప్రైవేట్ దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి హెచ్చరించారు.
నేడు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లు బంద్.
176
previous post