పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి కేసు దర్యాప్తులో జాతీయ దర్యాప్తు సంస్థ సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చింది. ఉగ్రవాదులు సాంకేతికతను వాడుకుని అత్యంత పక్కాగా ఈ దాడులకు వ్యూహం రచించినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. పహల్గామ్లో దాడులు చేయడానికి ఉగ్రవాదులు వారం రోజుల ముందే కుట్ర పన్నారు. ముఖ్యంగా పర్యాటకులు ఎక్కువగా సందర్శించే బైసారన్ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ ప్రణాళిక రచించారు. లొకేషన్లను ట్రాక్ చేయడానికి, సాధారణంగా పర్యాటకులు, కొండలు ఎక్కే ట్రెక్కర్స్ ఉపయోగించే మొబైల్ అప్లికేషన్లు, GPS టెక్నాలజీని ఉగ్రవాదులు వాడుకున్నారు. దాడి చేసిన తర్వాత సురక్షితంగా తప్పించుకోవడానికి కూడా ఈ జీపీఎస్ యాప్ల ద్వారానే రూట్ మ్యాప్లను సిద్ధం చేసుకున్నారు. ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లను ఎన్ఐఏ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ ఫోన్లలో పాకిస్తాన్లోని తమ కమాండర్లు, లీడర్లతో ఉగ్రవాదులు నిరంతరం చాటింగ్ చేసినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. పర్యాటకులు తమ రక్షణ, సురక్షిత గమ్యస్థానాల కోసం ఉపయోగించే మొబైల్ యాప్లను ఉగ్రవాదులు తమ డిజిటల్ విద్రోహ చర్యలకు వాడుకోవడం జమ్ముకశ్మీర్ భద్రతా బలగాలకు ఇప్పుడు పెద్ద సవాల్గా మారింది. ఈ సాంకేతిక ఆధారాల ద్వారా ఉగ్రవాదుల స్థానిక నెట్వర్క్, వారికి సహకరించిన వారిని పట్టుకునేందుకు ఎన్ఐఏ నిఘాను మరింత తీవ్రం చేసింది.
పహల్గామ్ ఉగ్రదాడిపై NIA దర్యాప్తులో సంచలన విషయాలు.
107