స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్లో ఉద్రిక్తతలు మరింత ముదిరాయి. యూఏఈ ప్రభుత్వ రంగ చమురు సంస్థ ADNOCకు చెందిన నౌకలను ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ లక్ష్యంగా చేసుకున్నట్లు యూఏఈ ఆరోపిస్తోంది. కేవలం ఒక్క వారంలోనే మూడు వేర్వేరు నౌకలపై క్షిపణి దాడులు జరిగినట్లు తెలిపింది. ముడి చమురు రవాణా చేసే ‘మొంబాసా బి’, ‘అల్ బహియా’ నౌకలు దాడుల్లో దెబ్బతిన్నట్లు సమాచారం.
ఆగస్టు 8న హార్ముజ్ జలసంధి దాటుతున్న మరో ట్యాంకర్పై క్రూయిజ్ క్షిపణితో దాడి జరిగినట్లు యూఏఈ వెల్లడించింది. దాడి తర్వాత నౌకలో మంటలు చెలరేగగా అత్యవసర సిబ్బంది వాటిని అదుపులోకి తెచ్చినట్లు తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఘర్షణలు మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు యూఏఈకి చెందిన 15 నౌకలను ఇరాన్ లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం. ఈ దాడుల్లో ఒక భారతీయ నౌకా సిబ్బంది మృతి చెందగా.. మరో 20 మంది గాయపడినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.
మరోవైపు ఇరాన్ చర్యలపై యూఏఈ తీవ్రంగా మండిపడుతోంది. సముద్ర దాడులను ‘పైరసీ’గా అభివర్ణిస్తూ.. అంతర్జాతీయ నౌకాయాన స్వేచ్ఛను దెబ్బతీసేలా ఇరాన్ వ్యవహరిస్తోందని ఆరోపించింది. హార్ముజ్ జలసంధిలో చమురు రవాణాకు ఆటంకం కలిగించడం ప్రపంచ ఇంధన మార్కెట్లపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో గల్ఫ్ దేశాల్లో ఆందోళన మరింత పెరుగుతోంది.
అయితే తమ చర్యలను ఇరాన్ సమర్థించుకుంటోంది. తమ హెచ్చరికలను పట్టించుకోకుండా కొన్ని నౌకలు నావిగేషన్ వ్యవస్థలను ఆపివేసి.. మైన్లు ఉన్న మార్గంలో ప్రయాణించేందుకు ప్రయత్నించాయని ఆరోపించింది. అందుకే వాటిపై చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని చెబుతోంది. మరోవైపు సౌదీ అరేబియా, ఖతార్, జోర్డాన్ సహా పలు దేశాలు యూఏఈకి మద్దతుగా నిలిచాయి. హార్ముజ్లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు అంతర్జాతీయ నౌకాయానం, చమురు సరఫరాపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది ఇప్పుడు ప్రపంచ దేశాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.