విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు పై కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ఆ బిల్లును ఉమ్మడి పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపించేందుకు నోట్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించింది. ప్రజలు, మైనారిటీ సంస్థలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం FCRA బిల్లును జేపీసీకి పంపేందుకు మొగ్గు చూపింది. మరోవైపు ఇదే బిల్లును ప్రభుత్వం బేషరుతగా ఉపసంహరించుకోవాలని ఉభయ సభల్లో కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.
ఒకవేళ FCRA బిల్లును లోక్సభ, రాజ్యసభ సభ్యులతో కూడిన జాయింట్ పార్లమెంట్ కమిటీ (JPC)కి పంపితే.. బిల్లులోని ప్రతీ నిబంధనను, ముఖ్యంగా ఆస్తుల నిర్వహణ, జరిమానాలకు సంబంధించిన ప్రతి చాప్టర్ను క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలు, చట్టపరమైన నిపుణులు, ధార్మిక ట్రస్టులు, ప్రభుత్వ అధికారుల నుంచి లిఖితపూర్వక, ప్రత్యక్ష సాక్ష్యాలను జేపీసీ సేకరించనుంది. కమిటీ తన సిఫార్సులతో నివేదికను రూపొందించిన తర్వాత, తదుపరి పార్లమెంట్ సమావేశాల్లో సవరించిన బిల్లును ఉభయ సభల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది.
గతంలో ప్రతిపాదించిన వక్ఫ్ సవరణ బిల్లు-2024 విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఇదే విధమైన పార్లమెంటరీ మార్గాన్ని ఎంచుకుంది. ఆ బిల్లును కూడా చట్టంగా రూపకల్పన చేయడానికి ముందు విస్తృతమైన చర్చలు, న్యాయ నిపుణుల అభిప్రాయ సేకరణ, క్షుణ్ణమైన పరిశీలన కోసం జేపీసీకి పంపించారు. అదే తరహాలోనే ఇప్పుడు FCRA సవరణ బిల్లుపై కూడా పార్లమెంట్ సభ్యులు, నిపుణుల సలహాలను స్వీకరించేందుకు జేపీసీకి నివేదించాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఇక FCRA సవరణ బిల్లులోని కొన్ని నిబంధనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని ప్రతిపక్షాలు, స్వచ్ఛంద సంస్థలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా విదేశీ విరాళాల నమోదు రద్దయినా, ముగిసినా, స్వచ్ఛందంగా ఉపసంహరించుకున్నా.. ఆ నిధులతో ఏర్పాటు చేసిన విద్యాసంస్థలు, ఆసుపత్రులు, కమ్యూనిటీ సెంటర్ల వంటి ఆస్తులను ప్రభుత్వ ‘డెసిగ్నేటెడ్ అథారిటీ’ స్వాధీనం చేసుకునే నిబంధనపై భయాందోళనలు నెలకొన్నాయి. అయితే, విదేశీ నిధుల ప్రవాహాన్ని నియంత్రించడం, పారదర్శకతను పెంచడం, జాతీయ భద్రతను కాపాడటం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని కేంద్రం చెబుతోంది.