ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక శాఖపై శ్వేతపత్రాన్ని విడుదల చేసిన సీఎం… గత ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నదని ఆరోపించారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బ్రాండ్ ఏపీని తిరిగి నిలబెట్టే ప్రయత్నాలు ప్రారంభించామని తెలిపారు. విభజన సమయంలో ఆస్తుల పంపకం సరిగా జరగలేదని, తెలంగాణలోని ఆస్తులను తెలుగు వారే వినియోగిస్తున్నారని అన్నారు. 2025-26లో పది సూత్రాలతో స్వర్ణాంధ్ర విజన్-2047ను రూపొందించి రాష్ట్ర అభివృద్ధికి కార్యాచరణ చేపట్టామని సీఎం వెల్లడించారు.
ఆర్థిక శాఖపై శ్వేతపత్రాన్ని విడుదల చేసిన సీఎం చంద్రబాబు… రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజలకు పారదర్శకంగా తెలియజేయడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. గత రెండేళ్లలో కూటమి ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణతో పనిచేసిందని చెప్పారు. మంచి పాలన ప్రజల జీవితాలపై సానుకూల ప్రభావం చూపుతుందని, చెడు పాలన రాష్ట్రాన్ని వెనక్కి నెడుతుందని వ్యాఖ్యానించారు. 2024 ఎన్నికల్లో ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు.
రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కు క్లిష్ట పరిస్థితులు ఎదురయ్యాయని సీఎం గుర్తుచేశారు. 2014లో బస్సులో నుంచే పరిపాలన ప్రారంభించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. విభజనలో ఆస్తుల పంపకం సక్రమంగా జరగలేదని, అయినప్పటికీ తాను ఎప్పుడూ బాధపడలేదని చెప్పారు. 2019 నుంచి 2024 వరకు రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిందని, పరిశ్రమలు దూరమయ్యాయని ఆరోపించారు.
ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. క్లిష్ట ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలను నిర్ణయించిన తేదీల్లోనే అమలు చేస్తున్నామని తెలిపారు. 2025-26లో పది సూత్రాలతో రూపొందించిన స్వర్ణాంధ్ర విజన్-2047 ద్వారా రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.