అప్పట్లో ప్రపంచాన్ని చిన్నాభిన్నం చేసిన కరోనా..మళ్లీ దేశంలోకి ఎంట్రీ ఇచ్చింది. ముంబాయిలో గత వారం రోజులుగా కోవిడ్ చాపకింద నీరులా వ్యాపిస్తోందని డాక్టర్లు చెబుతున్నారు. ముఖ్యంగా గత కొన్ని వారాలుగా కోవిడ్-19, స్వైన్ ఫ్లూ , ఇన్ఫ్లుయెంజా వంటి శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల కేసులు గణనీయంగా పెరిగాయి. దీంతో నగరంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. తీవ్ర జ్వరం, ఒళ్లు నొప్పులు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలతో బాధపడుతూ అనేకమంది ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు.
దాదాపు నెల రోజుల పాటు స్వైన్ ఫ్లూ కేసులు అధికంగా నమోదు కాగా, గత వారం నుంచి కోవిడ్ కేసులు మళ్లీ పుంజుకున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. బ్రీచ్ క్యాండీ వంటి ఆస్పత్రుల్లోని ల్యాబ్లలో ప్రతిరోజూ 7కు పైగా కోవిడ్ లేదా స్వైన్ ఫ్లూ పాజిటివ్ కేసులు వెలుగుచూస్తున్నాయి. ఒకేసారి పలు వైరస్లు వ్యాప్తిలో ఉండటంతో, లక్షణాలు ఒకేలా ఉండటంతో నిర్ధారణ కోసం పీసీఆర్ పరీక్షలు అవసరమవుతున్నాయని సీనియర్ డాక్టర్లు చెప్తున్నారు.
అయితే ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో ఎక్కువ శాతం స్వల్ప లక్షణాలతోనే ఉన్నప్పటికీ, వృద్ధులు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సొంతంగా యాంటీబయాటిక్స్ వాడొద్దని, లక్షణాలు తీవ్రంగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. రద్దీ ప్రాంతాల్లో మాస్కులు ధరించడం, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలని అధికారులు కోరుతున్నారు.