వచ్చే నెలలో ఐర్లండ్, ఇంగ్లండ్లో పర్యటించనున్న భారత క్రికెట్ జట్లను.. BCCI ప్రకటించింది. జూన్ 26 నుంచి 28 వరకు భారత్ ఐర్లండ్తో రెండు టీ 20 మ్యాచ్లు ఆడనుంది. అలాగే ఇంగ్లండ్ పర్యటనలో ఐదు టీ 20 లు, 3 వన్డేలు ఆడనుంది. అయితే ఇందులో ఇంగ్లండ్ టీ 20 సిరీస్కు మాత్రం జట్టును ఇంకా ప్రకటించలేదు. ఐర్లండ్తో పర్యటించే టీ 20 జట్టుకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా వ్యవహరిస్తుండగా… తిలక్ వర్మ వైస్ కెప్టెన్గా ఉంటాడు. సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, శివమ్ దూబే, అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ, ప్రసిద్ధ్ కృష్ణ జట్టులో సభ్యులుగా ఉంటారు.
ఇక ఇంగ్లండ్తో వన్డేలు ఆడే జట్టులో శుభ్మన్ గిల్ , రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, నితీశ్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్ సభ్యులుగా ఉంటారు. వీరిలో విరాట్ కోహ్లీ గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదని తెలుస్తోంది. ఒకవేళ సిరీస్ సమయానికి కోహ్లీ కోలుకుంటే జట్టులో చేరతాడని.. మేనేజ్మెంట్ ప్రకటించింది.
అయితే అఫ్ఘనిస్తాన్తో చివరి వన్డేలో సెంచరీ చేసిన యశస్వీ జైశ్వాల్ను, స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, రెగ్యులర్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ను ఈ రెండు జట్లలోకి ఎంపిక చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. అలాగే సీనియర్ బౌలర్ షమీని ఈ సారి కూడా పక్కనబెట్టడం, ఐపీఎల్లో అద్భుతంగా రాణించిన భువనేశ్వర్ కుమార్ పేరును కూడా జట్టు మేనేజ్మెంట్ పరిశీలించకపోవడం విమర్శలకు తావిస్తోంది.