దేశ రాజధాని ఢిల్లీలో వరుస అగ్నిప్రమాదాలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.తాజాగా తుగ్లకాబాద్లోని ఓ భవనంలో ఆకస్మికంగా మంటలు చెలరేగడంతో ముగ్గురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై కేసు నమోదు చేసి అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఇదిలా ఉంటే.. రాజధానిలో తరచూ జరుగుతున్న అగ్నిప్రమాదాల నేపథ్యంలో భవన భద్రతా నిబంధనలను మరింత కఠినతరం చేయాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. 15 మీటర్ల కంటే తక్కువ ఎత్తు ఉన్న నివాస భవనాలు, అపార్ట్మెంట్లలో కూడా అగ్నిమాపక భద్రతా చర్యలను తప్పనిసరి చేసేలా ఉపచట్టాలను రూపొందించే ప్రక్రియను పరిశీలిస్తోంది. అన్ని భవనాల్లో స్మోక్ డిటెక్టర్లు, అగ్నిమాపక నిరోధక పరికరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఢిల్లీ ఫైర్ సర్వీస్ సిఫార్సు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే నిర్మితమైన భవనాల్లోనూ కనీస భద్రతా ప్రమాణాలు అమలు చేసేందుకు అవసరమైన పరికరాలను ఏర్పాటు చేసే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. ఇటీవల మాల్వీయనగర్, వివేక్ విహార్ వంటి ప్రాంతాల్లో జరిగిన అగ్నిప్రమాదాల్లో పలువురు ప్రాణాలు కోల్పోవడంతో ప్రభుత్వం ఈ అంశాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంది. ప్రజల ప్రాణ భద్రతను దృష్టిలో ఉంచుకుని కఠిన అగ్నిమాపక నిబంధనల అమలుకు చర్యలు వేగవంతం చేయనుంది.
Tag:




Total views : 141468