హృదయాన్ని కదిలించే విషాద ఘటన మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది.బోటు ప్రమాదంలో ఓ తల్లి చూపించిన ప్రేమ.. అందరినీ కంటతడి పెట్టిస్తోంది.కళ్ల ముందు మృత్యువు కనిపిస్తున్నా తన చిన్నారి కొడుకును కాపాడుకోవాలని ఆ తల్లి చివరి క్షణం వరకు పోరాడింది.మరణం అంచున ఉన్నా ఆ పసివాడిని గుండెలకు హత్తుకుని రక్షించేందుకు ప్రయత్నించింది.కానీ విధి వేరుగా తీర్పు చెప్పింది.తన కుమారుడిని కాపాడుకోలేక ఆ తల్లి కన్నీళ్లు ఆమెతో పాటే కడలిలో కలిసిపోయాయి.మధ్యప్రదేశ్ బోటు ప్రమాదంలో కనిపించిన ఈ హృదయ విదారక దృశ్యం చూసిన ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది.
జబల్పూర్లోని బర్గి డ్యామ్లో గురువారం సాయంత్రం పడవ బోల్తా పడిన ఘటనలో పలువురు గల్లంతైయ్యారు.వారికోసం శుక్రవారం ఉదయం కూడా సహాయక చర్యలు కొనసాగాయి. ఈ క్రమంలోనే ఓ తల్లీబిడ్డల మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది గుర్తించి నీటి నుంచి వెలికితీశారు. నాలుగేళ్ల చిన్నారిని తల్లి అదిమిపట్టుకోగా వారి చుట్టూ లైఫ్ జాకెట్ ఉంది. నీటిలో మునిగిపోయే సమయంలో కుమారుడిని కాపాడటం కోసం ఆ తల్లి పడిన వేదనను తలుచుకుని అక్కడున్న వారు కదిలిపోయారు.
జబల్పూర్ జిల్లాలోని నర్మదా నదిపై ఈ బర్గి డ్యామ్ను నిర్మించారు. ఈ రిజర్వాయర్లో 29 మంది ప్రయాణికులు.. ఇద్దరు సిబ్బందితో వెళ్తున్న క్రూజ్ బోట్ తిరగబడింది. ప్రతికూల వాతావరణం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమికంగా నిర్ధరించారు. బలమైన గాలుల వల్ల రిజర్వాయర్లో నీరు కల్లోలంగా మారడాన్ని గుర్తించిన కొందరు ప్రయాణికులు పడవను వెనక్కి తిప్పాలని సిబ్బందిని కోరారు. అయితే, వీరు చెప్పింది బోటు నడిపేవారికి వినిపించకపోవడంతో.. వారు అలాగే ముందుకెళ్లారని కొందరు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కొందరిని బోటు నుంచి రక్షించారు.కాగా, ఈ ఘటనతో పలు నిర్వహణ లోపాలు బయటపడ్డాయి. ప్రయాణ సమయంలో సిబ్బంది ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటించలేదని కొందరు ప్రయాణికులు తెలిపారు. ముందు ఇవ్వకుండా పడవ ముగినిపోతున్న సమయంలో లైఫ్ జాకెట్లు అందించారని ఆరోపించారు. ఈ ఘటనలో మిగతా వారికోసం గాలింపు కొనసాగుతోంది.




Total views : 150904