Friday, August 14, 2026
News Navigation
Friday, August 14, 2026
News Navigation

Breaking

Friday, August 14, 2026
Home Crime బాలానగర్‌లో గంజాయి ముఠాపై తెలంగాణ ఈగల్ భారీ ఆపరేషన్.

బాలానగర్‌లో గంజాయి ముఠాపై తెలంగాణ ఈగల్ భారీ ఆపరేషన్.

by CVR NEWS

హైదరాబాద్ బాలానగర్‌లో గంజాయి ముఠాను పట్టుకునేందుకు వెళ్లిన తెలంగాణ ఈగల్ పోలీసులకు ఊహించని ప్రతిఘటన ఎదురైంది. నిందితులు పోలీసులపై కుక్కను వదలడంతో పాటు స్క్రూడ్రైవర్‌తో దాడికి పాల్పడ్డారు. అర్ధరాత్రి ప్రారంభమైన ఈ ఆపరేషన్‌లో నిందితుడు పక్క భవనాలపైకి దూకుతూ తప్పించుకునే ప్రయత్నం చేయగా.. ఎట్టకేలకు పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ కేసు దర్యాప్తులో మరింత సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి. గంజాయి ముఠాకు కొందరు పోలీసు సిబ్బందితో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తులో తేలినట్లు అధికారులు వెల్లడించారు.

హైదరాబాద్ బాలానగర్‌లో ఒక ఇంటిని కేంద్రంగా చేసుకుని గంజాయి విక్రయాలు సాగిస్తున్న ముఠాపై తెలంగాణ ఈగల్ పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్ సందర్భంగా నిందితులు పోలీసులపై దాడికి పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

ఏపీలోని పాడేరు ప్రాంతానికి చెందిన దుర్గాప్రసాద్, కమలాకర్, కిరణ్ అన్నదమ్ములు కొన్నేళ్ల క్రితం కుటుంబాలతో హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడ్డారు. బయటకు క్యాటరింగ్ బాయ్స్‌ను సరఫరా చేసే వ్యాపారం చేస్తున్నట్లు చెబుతూ, 2022 నుంచి గంజాయి విక్రయాలు ప్రారంభించినట్లు పోలీసులు గుర్తించారు.

ఆంధ్రా–ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుంచి గంజాయిని తీసుకువచ్చి చిన్న చిన్న పొట్లాలుగా తయారు చేసేవారని దర్యాప్తులో తేలింది. వాట్సాప్ ద్వారా ఆర్డర్లు స్వీకరించి, పాత ఎయిర్‌పోర్టు రోడ్డులో ముందుగా నిర్ణయించిన ప్రాంతాల్లో పొట్లాలను ఉంచి, వినియోగదారులకు ఫొటోలు, లొకేషన్ పంపే పద్ధతిలో విక్రయాలు సాగించినట్లు పోలీసులు వెల్లడించారు.

ఈ సమాచారం అందుకున్న తెలంగాణ ఈగల్ పోలీసులు డీఎస్పీలు నర్సింగరావు, రమేశ్ నేతృత్వంలో ప్రత్యేక బృందాలతో నిందితుల కదలికలపై నిఘా పెట్టారు.నిందితులు ఇంటికి చేరుకున్నట్లు గుర్తించిన పోలీసులు ఆ ఇంటిని చుట్టుముట్టి ఆపరేషన్ ప్రారంభించారు.

పోలీసులు ఆవరణలోకి ప్రవేశించగానే నిందితులు కుక్కను ఉసిగొల్పినట్లు సమాచారం. దీంతో ఓ కానిస్టేబుల్‌కు గాయమైంది. పోలీసులు అప్రమత్తమై ఇద్దరు నిందితులు దుర్గాప్రసాద్, కమలాకర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

అయితే కిరణ్ మాత్రం తప్పించుకునే ప్రయత్నంలో ఇన్‌స్పెక్టర్ మల్లేశ్‌పై స్క్రూడ్రైవర్‌తో దాడి చేసి, పక్క భవనాలపైకి ఎక్కి పరారయ్యేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో ఓ వృద్ధురాలి సెల్‌ఫోన్ తీసుకుని, ఓ అపార్టుమెంట్‌పైకి ఎక్కి పోలీసులతో వాదించినట్లు వెల్లడించారు.ఎట్టకేలకు అతడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కిరణ్ భార్య హారికను సైతం పోలీసులు అరెస్టు చేశారు.

నిందితుల ఇంట్లో సోదాలు నిర్వహించగా 14.5 కిలోల గంజాయి, ఒక ఎయిర్‌గన్ లభించినట్లు ఈగల్ అధికారులు వెల్లడించారు. నిందితుల సెల్‌ఫోన్లను పరిశీలించగా 203 మంది వారి వద్ద గంజాయి కొనుగోలు చేసినట్లు గుర్తించారు. వీరిలో వంద మందిని అదుపులోకి తీసుకుని పరీక్షలు నిర్వహించగా 72 మందికి పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు.

ఈ కేసు విచారణలో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చాయి. బాలానగర్ పోలీస్‌స్టేషన్‌కు చెందిన ఒక ఎస్సై, ఐదుగురు కానిస్టేబుళ్లతో నిందితులకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. ఈగల్ పోలీసులు దాడి చేయడానికి కొద్దిసేపటి ముందు ఓ కానిస్టేబుల్ నిందితుల ఇంటికి వచ్చి వెళ్లినట్లు కూడా దర్యాప్తులో తేలినట్లు అధికారులు పేర్కొన్నారు.

అలాగే నిందితుల ఇంట్లో జరిగిన ఓ ప్రైవేట్ పార్టీలో కొందరు పోలీసు సిబ్బంది పాల్గొన్నట్లు సమాచారం. అక్కడ పోలీసు వైర్‌లెస్ పరికరానికి సంబంధించిన మ్యాన్‌ప్యాక్ భాగం లభించడం ఈ వ్యవహారంలో మరిన్ని అనుమానాలకు తావిచ్చింది. నిందితులతో కొందరు పోలీసు సిబ్బంది కుమ్మక్కై, తనిఖీలు లేదా దాడులకు సంబంధించిన సమాచారాన్ని ముందుగానే చేరవేసేవారనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ వ్యవహారంలో బాధ్యులైన వారిపై శాఖాపరమైన, చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశముంది.

Advertisements

You may also like

Leave a Comment

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: