కార్పొరేట్ ఫైనాన్స్ కంపెనీల ధన దాహానికి దేశ గ్రామీణ అమాయకులే టార్గెట్లుగా మారుతున్నారా ? అప్పనంగా ప్రజల డబ్బులు కొట్టేసేందుకు ఫైనాన్స్ కంపెనీల తీరు మారడం లేదా ? ఒకప్పుడు చైన్ సిస్టం ద్వారా మరోసారి బిట్ కాయిన్ ద్వారా ఇంకోసారి రియల్ ఏస్టేట్ ద్వారా ఇలా రూపాలేదైన అమాయకులైన సామాన్యులే పావులవుతున్నారు. తాజాగా మరో కార్పొరేట్ కంపెనీ మాయాజాలంలో చిక్కి దిక్కుతోచని సామాన్యులు కొట్టుమిట్టాడుతున్నారు.
() కరీంనగర్ జిల్లా కేంద్రంలో సమావేశమైన వీరంతా యూనిక్ అనే ఓ ఫైనాన్స్ సంస్థ చేసిన గోల్మాల్ దందాలకు బలైన అమాయకులు. కష్టపడి సంపాదించి కూడబెట్టిన సొమ్మును భవిష్యత్తు కోసం పొదుపు చేయడం కోసం గుజరాత్ కు చెందిన యూనిక్ అనే కార్పొరేట్ సంస్థను నమ్మి దగాపడ్డ బాధితులు. గ్రూప్ ఆఫ్ కంపెనీ గా చెప్పుకుంటున్న ఈ సంస్థ దశాబ్ద కాలంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తమదైన శైలిలో గ్రామీణ పేద ప్రజల నుంచి డిపాజిట్ల రూపంలో డబ్బులను సేకరించి చేతులెత్తేసింది. తీసుకున్న డిపాజిట్లు రెట్టింపు ఇస్తామన్న యూనిక్ సంస్థ కనీసం సేకరించిన డబ్బును కూడా ఇవ్వడానికి సుముఖంగా లేదు. ఆయా గ్రామాల్లో పేరుందిన వారిని ఏజెంట్గా నియమించుకొని.. తమ సంస్థను కార్పోరేట్ సంస్థగా ప్రమోట్ చేస్తూ ప్రజల్లో నమ్మకాన్ని ఏర్పాటు చేసుకున్నది. తర్వాత కోట్లాది రూపాయల డబ్బులు సేకరించింది యూనిక్ సంస్థ. ప్రధానంగా డిపాజిట్ల రూపంలో అధిక వడ్డీని చూపెడుతూ ప్రజలను మోసం చేయడమే కాకుండా ఎక్కువ మొత్తంలో డబ్బులు సేకరించేందుకు ఏజెంట్లకు కమిషన్లు భారీగా ఇచ్చుకుంది. కమిషన్లకు ఆశపడ్డ ఏజెంట్లు గ్రామాల్లో ప్రతి గడపను తట్టారు. కూలీ నాలీ నుంచి మొదలుకొని మధ్యతరగతి ప్రజలను టార్గెట్గా చేసుకునే ఏజెంట్లు 100 రూపాయల నుంచి లక్షలాది రూపాయలు డిపాజిట్ల పేరుతో గుంజారు. ఇదంతా ఒక్కరోజో, నెలలో ఏడాదో చేసిన పని కాదు దాదాపు పది సంవత్సరాలుగా ఈ డిపాజిట్ల సేకరణ చేస్తూనే ఉన్నారు.చేసిన డిపాజిట్ లన్ని మెచ్యూరిటీ సమయానికి రెట్టింపు తో ఇస్తామని నమ్మబలికిన కంపెనీ డిపాజిట్లు మ్యాచురిటీ అయ్యేసరికి మొహం చాటేసింది.
ప్రజల మధ్య ఉన్న ఏజెంట్లు తమకు తెలిసిన వారి వద్ద నుండి సేకరించిన డబ్బును ఇవ్వాల్సిందిగా కంపెనీ చుట్టూ తిరగడం మొదలుపెట్టారు. అయితే ఇదిగో.. అదిగో అంటూ ఏళ్లు దాటేస్తూ ఒకరి కూడా డిపాజిట్లు రిటర్న్ ఇవ్వకపోవడంతో ఇటు డిపాజిట్ దారుల్లో అటు ఏజెంట్లలో గుబులు మొదలైంది. దీంతో నేరుగా గుజరాత్ కంపెనీకి సంబంధించిన యజమానిని సంప్రదించారు. కేవలం ఏజెంట్లను మాత్రమే ఏర్పాటు చేసి వారి ద్వారానే డబ్బులు సేకరించింది. సేకరించిన డబ్బుంతా కూడా విదేశాలకు తరలించారని చెప్పి సభ్యులు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే పలుచోట్ల యాజమాన్యం పైన కేసులు ఫైల్ అయినప్పటికీ కరీంనగర్ లో బాధితులకు మాత్రం ఎలాంటి భరోసా రాకపోవడంతో రానున్న రోజుల్లో దీనిపై ఆందోళన చేసేందుకు సిద్ధమవుతున్నారు. తమల్ని ఆదుకోవాలని.. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని.. యూనికాన్ కంపెనీ నుంచి తమ డబ్బును ఇప్పించాలని బాధితులు వేడుకుంటున్నారు.





Total views : 81448