ఆంధ్ర రాష్ట్రంలో అంగన్వాడీ మహిళలను ఏడిపిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి భవిష్యత్తులో ఏడుపే మిగులుతుందని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి అన్నారు. కార్మిక సంఘాల రాష్ట్ర పిలుపులో భాగంగా సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియుల ఆధ్వర్యంలో తిరుపతి నగరంలో మంగళవారం నాడు పెద్ద ఎత్తున జైలు భరో కార్యక్రమం జరిగింది. రాష్ట్రంలో సమ్మెలో ఉన్న అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికులు, సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జైలు భరో కార్యక్రమం మంగళవారం నాటి ఉదయం తిరుపతి నగరంలో జరిగింది. పాత మున్సిపల్ కార్యాలయం నుండి సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు కార్యకర్తలు, నాయకులతో పాటు అంగన్వాడీలు, ఎస్ఎస్ఏ లు పెద్ద సంఖ్యలో ప్రదర్శన చేపట్టారు. ప్రదర్శన నాలుగు కాళ్ల మండపం వద్దకు చేరుకునేటప్పటికీ పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. ప్రదర్శనను నిలిపివేయాలని ముందుకు వెళ్లడానికి వీలులేదని ఆంక్షలు పెట్టారు. దీంతో అంగన్వాడీలు, కార్మిక సంఘాల నేతలు నాలుగు కాళ్ల మండపం వద్ద బైఠాయించారు. మహిళలు పెద్ద సంఖ్యలో ఉండటంతో మగ పోలీసులతో అరెస్టు చేయటానికి పోలీసులు సంకోచిస్తూ తటపటాయించారు. ముందుకు పోనివ్వకుండా అరెస్టులు చేయకుండా నడిరోడ్డుపై కూర్చోబెట్టడాన్ని సహించలేని కార్మిక సంఘాల నేతలు తాము ప్రదర్శనని చేపడుతున్నామని ప్రకటించి ముందుకెళ్లారు. తూర్పు పోలీస్ స్టేషన్ డిఎస్పీ అందరినీ అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించడంతో పోలీసుల నడుమ భారీ సంఖ్యలో అంగన్వాడీలను తూర్పు పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా సిఐటియు, ఎఐటియుసి, ఐఎఫ్టియుల నేతలు కందారపు మురళి, కె. రాధాకృష్ణ, ఆర్. హరికృష్ణలు ప్రసంగిస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. 29 రోజులుగా సమ్మె సాగిస్తుంటే కనీసం సమస్యల పరిష్కారానికి చర్చించకపోగా ఎస్మాను ప్రయోగించి అంగన్వాడీ మహిళలను అపహాస్యం పాలు చేశారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత మరో మాట మాట్లాడటం ఆనవాయితీగా మారిందని తీవ్ర స్థాయిలో విమర్శించారు. తక్షణం కార్మిక సమస్యలు పరిష్కారం చేయకుంటే ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడించడం ఖాయమని నేతలు హెచ్చరించారు. తూర్పు పోలీస్ స్టేషన్ అంగన్వాడీ మహిళలతో నిండిపోయింది.ఈ సందర్భంగా కార్మిక సంఘాల నేతలు అంగన్వాడీలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సమస్యలను సామరస్యంగా పరిష్కరించకుంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి గుణపాఠం తప్పదని హెచ్చరించారు.
సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి
అంగన్వాడీలు 23 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీల పట్ల సానుకూలంగా స్పందించి పరిష్కరించని పక్షంలో ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడించడానికైనా వెనుకాడేది లేదని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి హెచ్చరించారు. అంగన్వాడీలు కోరుతున్న వేతనాల పెంపు, గ్రాట్యుటీ అమలు న్యాయమైన కోరికలని గుర్తు చేశారు. జనవరి 5వ తేదీ లోపు ఉద్యోగాల్లోకి రాకుంటే తొలగిస్తామని సిడిపిఓలు హెచ్చరికలు చేస్తున్నారని.. అంగన్వాడీల తొలగింపు కథ ఎలా ఉన్నా, అధికార వైసిపీ తొలగింపు ఖాయం అయిందని ఎద్దేవా చేశారు. మంత్రి రోజా ఎన్నికలకు ముందు అంగన్వాడీలకే తన మద్దతని, అసెంబ్లీలో తాను చేసిన గొడవ కారణంగానే జీతాలు పెరిగాయని గతంలో డప్పులు కొట్టేదని ఇప్పుడు మంత్రిగా ఉండి సమస్య పరిష్కరించక పోగా సిడిపిఓ ద్వారా అంగన్వాడీలను బెదిరించడానికి పూనుకుంటున్నదని మురళి విమర్శించారు. మహిళా మంత్రిగా ఉంటూ మహిళల పట్ల వ్యవహరించే తీరు ఇదేనా? అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఊసుపోక కబుర్లతో కాలాన్ని గడపటం మానుకుని అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ నిర్లక్ష్యం ఇలాగే కొనసాగితే రాష్ట్రంలోని అన్ని పక్షాల మద్దతుతో రాష్ట్ర బంద్ కు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు. తిరుపతి జిల్లాలోని అన్ని ప్రాజెక్టుల, సెక్టార్ల నుంచి అంగన్వాడీలు 3500 మందికి పైగా కలెక్టరేట్ వద్ద బైఠాయింపులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంగన్వాడి వర్కర్లు ఆయాలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. గౌరవ వేతనం మాకొద్దు, కనీస వేతనం కావాలి, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని నినాదాలు చేశారు. ఉదయం 10 గంటలకు ప్రారంభించిన బైఠాయింపు కార్యక్రమాన్ని సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయ గేటు వద్ద ప్రభుత్వం పంపిన నోటీసులను అంగన్వాడీలు దగ్ధం చేశారు. అంగన్వాడీలు సాగిస్తున్న పోరాటానికి అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం. జయంతి, పి. సాయి లక్ష్మి లు హాజరై మద్దతు ప్రకటించారు.






Total views : 141294