నూజివీడు మండలం రావిచర్ల గ్రామంలో జరుగుతున్న భూ సర్వేలో అవకతవకలు జరుగుతున్నాయంటూ రైతులు ఆరోపిస్తున్నారు. వైయస్సార్ జగనన్న భూ సురక్ష పథకంలో భాగంగా జరుగుతున్న సర్వేలో సుమారు 400 ఎకరాలు భూమిని సర్వే అధికారులు, సిబ్బంది ఎక్కువగా చూపుతున్నారని గ్రామస్తులు తెలియజేస్తున్నారు. గ్రామంలో మొత్తం 2,900 ఎకరాలు ఉండగా, ప్రస్తుతం సర్వే అనంతరం 3,300 ఎకరాలు భూమి ఉన్నట్లు చూపుతున్నారని రైతులు వాపోతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న సర్వే వల్ల గతంలో ఉన్న తమ భూమిలో మూడు అడుగుల నుండి 10 అడుగుల వరకు భూమిని కోల్పోతున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న భూ సర్వే వలన గ్రామంలో కలహాలకు ఆజ్యం పోస్తున్నట్లు ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గ్రామంలో కలిసికట్టుగా ఉన్న రైతులు భవిష్యత్తులో అమ్మకాలు కొనుగోలు జరిగిన సమయంలో, ఇప్పుడు జరిగిన భూ సర్వే వలన కొట్టుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని రైతులు వాపోతున్నారు. నేడు జరుగుతున్న సర్వే వలన కొంతమంది రైతులు తమ భూమిలో కొంత భాగాన్ని కోల్పోతుండగా, మరి కొంతమంది రైతులకు అదనంగా భూమి కలుస్తుందని రైతులు చెబుతున్నారు. గతంలో ఉన్న సర్వే లెక్కల ప్రకారమే తమకు భూములను చూపాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇళ్ల స్థలాలు, పొలాల్లో కూడా కొంత భూమిని కోల్పోతున్నట్లు ప్రజలు, రైతులు తెలుపుతున్నారు. తక్షణమే సర్వే పనులు నిలిపివేసి తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.
Eluru District News
ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం ఎర్ర వారి గూడెం సమీపంలో పులి సంచారం జరుగుతుందని జోరుగా ప్రచారం సాగుతుంది. గ్రామ శివారు పొలాల్లో గుర్తుతెలియని పాదముద్రలను గ్రామస్తులు గుర్తించారు. అది పులి అడుగుజాడలుగా గ్రామస్తులు భావిస్తూ భయభ్రాంతులకు గురవుతున్నారు. పొలంలోకి వెళ్లి సాగు చేసుకోవడానికి ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా తమ గ్రామంలోకి పులి వస్తుందేమే అనే భయంతో బిక్కుబిక్కున బతుకుతున్నారు. ఫారెస్ట్ అధికారులు వచ్చి తమకు రక్షణ కల్పించాలని మరియు పులిని పట్టుకుని మా గ్రామాన్ని రక్షించాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు. ఈ సమాచారాన్ని ఫారెస్ట్ అధికారులకు తెలియజేశామని గ్రామస్తులు చెపుతున్నారు.
ఏలూరు జిల్లా నూజివీడు సబ్ జైలులో ఉన్న పలుకు టిడిపి కార్యకర్తలను విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని పరామర్శించారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గత నాలుగు రోజుల క్రితం జరిగిన గొడవలో ఎస్సై సతీష్ కు గాయం అవడంతో పోలీసులు పలువురిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచుగా మొత్తం పదిమందిని జడ్జి రిమాండ్ కు తరలించారు. విషయం తెలుసుకున్న విజయవాడ ఎంపీ కేశినేని నాని నేడు నూజివీడు సబ్ జైల్లో ఉన్న తన అనుచరులను పరామర్శించడానికి వచ్చి అనంతరం మీడియాతో మాట్లాడుతూ తన సొంత అనుచరులు ముగ్గురు జైల్లో ఉన్నారని వారిని పరామర్శించడానికి వచ్చాను త్వరలోనే వారికి బెయిల్ కూడా వస్తుందని ఆశిస్తున్నానని అన్నారు.
కేంద్రంలోని బిజెపి, ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నిరంకుశ ప్రజా వ్యతిరేక పాలనను వచ్చే ఎన్నికల్లో తరిమికొట్టేందుకు అందరూ కలిసి రావాలని కాంగ్రెస్ పార్టీ నేత మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం పిలుపునిచ్చారు. ఏలూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన సమాలోచన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోలవరం ప్రాజెక్టును, అమరావతి రాజధానిని విస్మరించాయని ఆయన విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. వైసిపి దళితులపై కపట ప్రేమ చూపిస్తూ వారిపై దాడులకు పాల్పడుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీలను సంఘాలను ఏకం చేసి బిజెపితో పొత్తు పెట్టుకున్న పార్టీలను వచ్చే ఎన్నికల్లో చిత్తుగా ఓడిస్తామని హెచ్చరించారు..





Total views : 149902