మెదక్ జిల్లా తూప్రాన్ కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరగా… నాచారం దేవాలయం వద్ద ప్రమాణానికి వెళ్తున్న మహిపాల్ రెడ్డి బైక్ ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తూప్రాన్ కాంగ్రెస్ పార్టీలో నర్సారెడ్డి, మైనంపల్లి హనుమంతరావు వర్గాల మధ్య కొనసాగుతున్న ఆధిపత్య పోరు కొత్త మలుపు తిరిగింది. గత కొద్ది రోజులుగా ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ రాజకీయ వేడి పెంచుతున్నాయి.
ఈ నేపథ్యంలో తడి బట్టలతో నాచారం దేవాలయానికి వెళ్లి నర్సారెడ్డి అవినీతిని బయటపెడతానంటూ సవాల్ విసిరారు మహిపాల్ రెడ్డి… అంతేకాదు..భారీ బైక్ ర్యాలీతో నాచారం బయలుదేరారు. అయితే మార్గమధ్యలో పోలీసులు ర్యాలీని అడ్డుకోవడంతో కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని… నర్సారెడ్డి అవినీతికి సంబంధించిన పూర్తి చిట్టా తన వద్ద ఉందని మహిపాల్ రెడ్డి బల్లగుద్ది మరీ చెప్పారు. సమయం వచ్చినప్పుడు ప్రజల ముందుంచుతానన్న ఆయన..తాను ఏ పార్టీలో ఉన్నా నిబద్ధతతో పనిచేశానన్నారు. దేవుడు సాక్షిగా ప్రమాణం చేసి..నర్సారెడ్డి అవినీతిని ఎండగడుతానని బహిరంగంగా సవాల్ చేయడంతో కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు బట్టబయలయ్యాయి… కొంతకాలంగా ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకోవడం తాజాగా మహిపాల్ రెడ్డి సవాల్ తో స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే..ఈ వివాదంపై నర్సారెడ్డి వర్గం ఎలా స్పందిస్తుందనేది స్థానిక నేతల్లో చర్చనీయాంశంగా మారింది.




Total views : 221094