నల్గొండలో నిర్వహించిన సమీక్షా సమావేశం అనంతరం మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాఫిగా మారాయి. ఆయన మాటల్లో స్పష్టతతో పాటు ప్రతిపక్షంపై పదునైన విమర్శలు కనిపించాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ ప్రస్తుత స్థితిని ఎండగట్టేలా ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే విచ్ఛిన్నమైందని, ఇకపై ఆ పార్టీ అధికారంలోకి రావడం అసాధ్యమని ఆయన బలంగా నమ్ముతున్నారు. 2039 వరకు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తూనే, కేసీఆర్ కుటుంబంలో జరుగుతున్న అంతర్గత విభేదాలను ఆయన బయటపెట్టారు. పదవులు, పంపకాల కోసం తండ్రి-కొడుకులు, మామ- అల్లుడు మధ్య పోరు నడుస్తోందని, ముందు కేసీఆర్ తన ‘ఇల్లు చక్కదిద్దుకోవాలి’ అని ఆయన హితవు పలికారు.
గత పదేళ్ల పాలనలో కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలను మంత్రి ఎండగట్టారని, దళితుడే తొలి సీఎం, ఇంటికో ఉద్యోగం, దళితులకు మూడెకరాల భూమి వంటి మాటలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. కనీసం అర్హులైన వారికి రేషన్ కార్డులు కూడా ఇవ్వలేని ప్రభుత్వం, ఇప్పుడు పునరంకితం గురించి మాట్లాడటం హాస్యాస్పదమని విమర్శించారు. కేసీఆర్ అబద్ధాలు ఆడటంలో దిట్ట అని, ఆయన ఫ్రస్టేషన్లో ఉండి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జీవన్ రెడ్డి వంటి సీనియర్ నేతలు బీఆర్ఎస్ వైపు చూడటం సరైన నిర్ణయం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే మహిళా బిల్లు విషయంలో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉందని, రాహుల్ గాంధీ నాయకత్వంలో పార్టీ ఎప్పుడూ సానుకూలంగా ఉంటుందని స్పష్టం చేశారు. మెుత్తానికి వెంకటరెడ్డి ప్రసంగం రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాలు ఎంత వేడెక్కనున్నాయో సూచిస్తోంది.





Total views : 141341