అమెరికా- ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం వేళ ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేశారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న పరిస్థితులపై ఇరువురు నేతలు చర్చించారు. అలాగే, హర్మూజ్ జలసంధిని తెరిచిఉంచాల్సిన ఆవశ్యకతపైనా చర్చించినట్లు భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. ఈ ఏడాదిలో ప్రధాని మోదీతో ట్రంప్ టెలిఫోన్ సంభాషణ జరపడం ఇది రెండోసారి.
పశ్చిమాసియాలో పరిస్థితులపై తమ మధ్య ప్రయోజనకరమైన చర్చ సాగిందన్నారు ప్రధాని మోదీ. వీలైనంత త్వరగా ఉద్రిక్తతలను తగ్గించి, శాంతిని పునరుద్ధరించేందుకు భారత్ మద్దతు ఉంటుందని స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు. హర్మూజ్ జలసంధిని తెరిచి ఉంచడం, రక్షణ కల్పించడం, అందరికీ అందుబాటులో ఉండేలా చూడటం యావత్ ప్రపంచానికి అత్యవసరమని పేర్కొన్నారు. శాంతి, సుస్థిరత కోసం చేసే ప్రయత్నాలకు భారత్ సహకారం ఉంటుందని తెలిపారు. ఈమేరకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో ఫోన్లో మాట్లాడినట్లు ప్రధాని మోదీ ‘ఎక్స్’లో పోస్టు పెట్టారు.
మరోవైపు, ఇరాన్లో విద్యుత్కేంద్రాలు, ఇంధన మౌలికసదుపాయాలపై ఐదు రోజుల పాటు దాడులు నిలిపివేస్తున్నట్టు ట్రంప్ ప్రకటించిన మరుసటిరోజే ..నేరుగా ప్రధాని మోదీకి ఫోన్ చేసి మాట్లాడారు. భారత్ది ఎప్పుడూ శాంతి మార్గమేనని, యుద్ధమనేది మానవాళి ప్రయోజనాలకు ఏమాత్రం శ్రేయం కాదని ప్రధాని మోదీ ఇప్పటికే స్పష్టం చేశారు. ఇరు దేశాలు చర్చల ద్వారానే తమ మధ్య విభేదాలను పరిష్కరించుకోవాలని, ఆ దిశగానే ముందుకెళ్లాలని పార్లమెంటులో మోదీ మాట్లాడిన నేపథ్యంలో.. ట్రంప్ ఫోన్ చేసి మాట్లాడటం ప్రాధాన్యం సంతరించుకుంది.





Total views : 140825