మంచిర్యాల జిల్లా మందమర్రి సింగరేణి ప్రాంతంలో ప్రైవేటు సెక్యూరిటీ గార్డుల సమస్య తీవ్ర రూపం దాల్చింది. దాదాపు 11 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న 213 మంది గార్డులు టెండర్ గందరగోళం కారణంగా ఒక్కసారిగా ఉపాధి కోల్పోయారు. సింగరేణి సంస్థలో ఆస్తుల పరిరక్షణ, బొగ్గు గనుల భద్రత కోసం 2015లో ప్రైవేటు గార్డులను నియమించగా, అప్పటి నుంచి స్థానిక నిరుద్యోగులు, భూ నిర్వాసితులు, కార్మిక కుటుంబాలకు చెందిన వారు ఈ ఉద్యోగాలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. తక్కువ వేతనాలకే అయినా కుటుంబాలను పోషించుకుంటున్న ఈ గార్డులు, కాంట్రాక్ట్ ముగియడంతో రోడ్డున పడాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రతి రెండేళ్లకోసారి టెండర్ ప్రక్రియ ద్వారా నియామకాలు జరగడం వల్ల ఉద్యోగ భద్రత లేకుండా పోతుంది . ఇప్పటివరకు కొనసాగిన విధులు అకస్మాత్తుగా నిలిచిపోవడంతో వారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. విధులకు పిలవకపోవడంతో కుటుంబాలపై ఆర్థిక భారం పెరిగి, గార్డులు నిరాశలో మునిగిపోయారు.
2025లో కాంట్రాక్ట్ ముగిసిన తర్వాత కొత్త టెండర్ ప్రక్రియలో వచ్చిన అభ్యంతరాలు సమస్యను మరింత క్లిష్టం చేశాయి. మొదట 130 మంది కోసం టెండర్ పిలిచినా వివాదాలు తలెత్తడంతో పాత కాంట్రాక్టర్కు తాత్కాలికంగా పొడిగింపు ఇచ్చారు. అయితే 2026 ఫిబ్రవరి 28తో అది కూడా ముగియడంతో పరిస్థితి మరింత సంక్లిష్టమైంది. జనవరిలో మరోసారి 90 మంది కోసం టెండర్ పిలిచినా నిబంధనలపై అభ్యంతరాలు వ్యక్తమవడంతో కేసు కోర్టుకు వెళ్లి ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో మొత్తం 213 మంది గార్డులు ఉపాధి కోల్పోయారు. గత 40 రోజులుగా వారు నిరసనలు, ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తూ తమ సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. కార్మిక సంఘాలు కూడా వారికి మద్దతు తెలుపుతున్నాయి. కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో పాత పోస్టులను కొనసాగిస్తూ వెంటనే కొత్త టెండర్ పిలిచి తమకు తిరిగి ఉపాధి కల్పించాలని గార్డులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.ఈ సందర్భంగా సెక్యూరిటీ గార్డులు భిక్షాటన చేసి నిరసన తెలిపారు





Total views : 56519