దుష్టశిక్షణ, శిష్ట రక్షణ, ధర్మసంస్థాపన ల కోసం పందొమ్మిదవ శతాబ్దంలో ఈ భువిపై వెలసిన సమర్థ సద్గురువు శ్రీ సాయినాధుడు. తనను మనస్ఫూర్తిగా విశ్వసించి తన భక్తులకు ఎల్లవేళలా వెన్నంటి వుండి వారికి తన అమూల్యమైన, అభేద్యమైన రక్షణ కవచం అందించడమే కాక, తన బోధనలతో, ఉపదేశములతో వారిలో పరివర్తన గావించి, సన్మార్గంలో నడిపించే అద్భుతమైన దైవం శ్రీ సాయి. శ్రీ సాయిని నమ్మిన లక్షలాది మంది ఈనాటికీ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవిస్తున్నారు. శ్రీ సాయి తన భక్తులను రక్షించి, వారి సమస్యలను, చింతలను, దూరం చేసే పద్ధతి చాలా విచిత్రమైనది. ఆది ఏ సంప్రదాయాలకు, మతాలకు చెందినది. అటువంటి ఒక విచిత్రమైన లీలలను ఇప్పుడు స్మరించుకుందాం.
శ్రీ సాయికి అత్యంత సన్నిహిత , ముఖ్యమైన భక్తుడైన బాపూసాహెబ్ బూటీ ఒకసారి జిగట ఇరోచనముల వలన తీవ్రంగా బాధపడ్డాడు. స్వతహాగా ధనవంతుడవడం వలన ఎందరో ప్రసిద్ధులైన డాక్టరుకు చూపించుకొని వారిచ్చే మందులను వాడాడు కానీ ఏమీ ప్రయోజనం లేకపోయింది. కొద్ది రోజులలోనే బ్యూటీ బాగా నీరసించిపోయాడు. కదల లేకపోవడం వలన శ్రీ సాయి దర్శనానికి మశీదుకు పోలేకపోయాడు. అప్పుడు బాబా అతనిని మశీదుకు రమ్మని కబురు పంపించి, బూటీ రాగానే తన ముందు కూర్చోబెట్టుకొని తన చూపుడు వేలు ఆడించుచూ“ తస్మాత్ జాగ్రత్త ! నీవిక విరేచనము చేయకూడదు“ అని దృఢంగా పలికారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు రాజాధి రాజు అయిన బాబా ఆ మాటలను అనగానే వెంటనే విరేచనాలు ఆగిపోయాయి. గొప్ప గొప్ప డాక్టర్లు, విలువైన మందులు కుదర్చలేని జబ్బును ఆ మహానుభావుడు కేవలం తన మాటలతో కుదిర్చిన వైనం అత్యంత విశిష్టమైనది.
మరొక సందర్భంలో బూటీకి కలరా వ్యాధి సోకింది. ఒక రోజులో తీవ్రంగా నీరసించిపోయాడు.ఏ విధమైన ఆహారాన్ని, కనీసం నీరును కూడా తాగలేకపోయాడు. బూటీకి సన్నిహితుడు డాక్టర్ పిళ్లై తన వద్ద వున్న ఔషధముల నింటినీ ప్రయత్నించాడు. కానీ ఇది కొద్దిపాటి ఉపశమనాన్ని కూడా ఇవ్వలేకపోయారు. అప్పుడు బూటీ మశీదుకు వెళ్ళి బాబా కాళ్ళపై పడి తన వ్యాధిని తగ్గించమని ప్రాధేయపడ్దాడు. అప్పుడు శ్రీ సాయి బాదాముపప్పు, పిస్తా,అక్రోటు లను బాగా నానబెట్టి, పాలు, చక్కెరలో ఉడికించి సేవించమని చెప్పారు. ఆ మాటలను విన్న వారందరూ ఎంతగానో ఆశ్చర్యపోయారు. ఎందుకంటే వైద్య శాస్త్రం ప్రకారం ఈ మిశ్రమాన్ని సేవిస్తే జబ్బు మరింత తీవ్రమై చివరకు ప్రాణాలకే ముప్పు కలుగవచ్చును. కానీ బూటీ బాబా ఆజ్ఞను శిరసావహించి ఆ మిశ్రమాన్ని సేవించాడు. చిత్రాతిచిత్రంగా బ్యూటీ యొక్క కలరా వ్యాధి కొద్ది గంటలలోనే తగ్గిపోయి అతనికి పూర్తి స్వస్థత చేకూరింది.
ఈ విధంగా వైద్య విజ్ఞాన శాస్త్రాలు అన్నింటికీ విరుద్ధంగా బాబా తనదైన ప్రత్యేక శైలిలో తన భక్తుల రోగాలను తగ్గించి వేశారు. ఇందులో మనం గ్రహించవలసింది ఏమిటంటే బాబా మాటలే ఈ ప్రకృతి అంతటికి శిరోధార్యం. బాబా పలుకులే వేద, విజ్ఞాన శాస్త్రాలు. సాంప్రదాయములు, ఆచార వ్యవహారములు, మంత్ర శక్తులు, వైద్య విధానాలు అన్నీ బాబా యొక్క అపూర్వమైన యోగ శక్తి ముందు దిగదుడుపే!బాబా ఆజ్ఞను శిరసా వహించి వారికి ఆయన యొక్క అనుగ్రహ,కరుణా కటాక్షములు లభ్యమై జీవితం ఆనందంగా, సాఫీగా సాగిపోతుంది.
Read Also..
Read Also..





Total views : 62166