దేశవ్యాప్తంగా బీజేపీకి మద్దతు పెరుగుతుండటంతో దక్షిణాదిలో కూడా మంచి ఫలితాలు వస్తున్నాయని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా తమ పార్టీ అధికారంలోకి తీసుకురావాలని, డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడాలని ప్రజలు ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనకు రానున్న సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించ తలపెట్టిన భారీ బహిరంగ సభ జన ఆగ్రహ సభ పోస్టర్ను ఆవిష్కరించారు. అంతకు ముందు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ప్రధాని పర్యటన ఏర్పాట్లు వివిధ అంశాలపై విస్తృతంగా చర్చించారు. మే 10న హైదరాబాద్లో దాదాపు 8వేల కోట్ల అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారని రాంచందర్ రావు తెలిపారు. మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధాని తొలిసారిగా తెలంగాణకు వస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మేధావులు, మహిళలు, యువత, జెన్-జడ్ సహా అన్ని వర్గాల ప్రజలు బీజేపీ వైపు ఆకర్షితులవుతున్నారని చెప్పారు.
పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా బీజేపీ విజయాన్ని సాధిస్తుందని, పుదుచ్చేరిలోనూ అధికారంలోకి వస్తుందన్నారు. అదే విధంగా రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని తీసుకువచ్చేలా ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. బీఆర్ఎస్ పాలనలో మహిళలకు తీవ్ర అన్యాయం జరిగిందని…కేబినెట్లో మహిళలకు సరైన ప్రాతినిధ్యం ఇవ్వలేదని అన్నారు. పాలనలో కూడా తీవ్ర అన్యాయం చేసిందని విమర్శించారు రామచందర్ రావు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మహిళల పట్ల, యువత పట్ల, రాష్ట్ర ప్రజల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఈ పార్టీలకు తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని రాంచందర్ రావు పేర్కొన్నారు.




Total views : 61456