సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం పలు చారిత్రాత్మక బిల్లులకు ఆమోదం తెలిపింది. సామాజిక భద్రత, కార్మిక సంక్షేమం మరియు మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే వారికి షాక్ ఇచ్చేలా కేబినెట్ ఈ బిల్లును ఆమోదించింది. తల్లిదండ్రులను సరిగ్గా ఆదరించని ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల వేతనాల్లో కోత విధించాలని నిర్ణయించారు. వారి జీతం నుండి 15 శాతం లేదంటే రూ.10 వేలు నేరుగా తల్లిదండ్రులకు అందేలా రూపొందించిన బిల్లుకు కేబినెట్ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.
ఇక L&T నుంచి హైదరాబాద్ మెట్రో స్వాధీన ప్రక్రియను వేగవంతం చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ప్రభుత్వ పరంగా జరగాల్సిన లావాదేవీల నిర్వహణ బాధ్యతను HMRL కు అప్పగించారు. రాష్ట్రంలో చేపట్టిన కులగణనపై జస్టిస్ సుదర్శన్ రెడ్డి కమిటీ సమర్పించిన నివేదికను మంత్రివర్గం ఏకగ్రీవంగా ఆమోదించింది. విద్వేషపూరిత ప్రసంగాలు , నేరాల నిరోధక బిల్లుకు ఆమోదముద్ర వేసింది. ఇక గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం ప్రత్యేక బిల్లు, న్యాయవాదుల రక్షణ కోసం ‘తెలంగాణ అడ్వొకేట్ ప్రొటెక్షన్ బిల్లు, యూనివర్సిటీల్లో వివక్షను అరికట్టేందుకు తీసుకురానున్న ‘రోహిత్ వేముల చట్టం’ విధివిధానాల కోసం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో మంత్రులు దామోదర్ రాజనర్సింహ, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ సభ్యులుగా ఉంటారు. రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా ఈ బిల్లులను రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి చట్టరూపం తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.





Total views : 141173